గ్రామపంచాయతీ వద్ద హనుమాన్ ఆలయంలో దొంగతనం
వెండి వస్తువులు ఎత్తుకెళ్లారని పూజారి పోలీసులకి సమాచారం
మేడ్చల్ ముచ్చట్లు, జూన్ 23: ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లోని లక్ష్మాపూర్ గ్రామం కొన్ని సంవత్సరాలనుండి ప్రశాంతంగా ఉన్నా, ఇటీవలి రోజులలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు స్థానిక ప్రజల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి.ఈరోజు ఉదయం హనుమాన్ దేవాలయం లొ దొంగలు పడ్డారు అన్న వార్తతో ప్రజలు నిద్ర లేచారు.గ్రామపంచాయతీ వద్ద హనుమాన్ ఆలయంలో దొంగతనం జరిగింది.స్వామి వారికి అలంకరించిన వెండి వస్తువులు చేయి, కంఠం, నామాలు పాదాలు ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు.ఇప్పటికే గ్రామంలోని మూడు ప్రధాన గుళ్లలో దొంగతనాలు జరిగాయి. దేవాలయాల్లోని హుండీలు బద్దలుకొట్టడం, విలువైన ఆభరణాలు, పుణ్య సామగ్రి అపహరించడం కలవరపెడుతోంది. భక్తులు ప్రతిరోజూ నమ్మకంతో పూజలు చేసేందుకు వచ్చే గుళ్లు ఇప్పుడు అపరాధకారులకు లక్ష్యంగా మారుతున్నాయి.గ్రామస్థులు చెబుతున్న వివరాల ప్రకారం, గత ఆరు నెలలనుండి ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పటికీ నిందితులు పట్టుబడకపోవడంతో పోలీసులపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.పోలీసు విభాగం దీనికి స్పందిస్తూ, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేసినట్టు తెలిపింది. సీసీ టీవీ పుటేజీలు అందుబాటులో లేకపోవడం కెమెరాలు పనిచెయకపోవడం పోలీసులకి సవాలుగా మారిందన్నారు, స్థానికుల సమాచారం ఆధారంగానే దర్యాప్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.







